
బంగారం, వెండి ధరలు గత కొంతకాలంగా భారీగా పడిపోతున్నాయి. రోజురోజుకి భారీగా పతనమవుతూ కొనుగోలుదారులకు ఊరట కల్గిస్తున్నాయి. ఈ నెలలో గోల్డ్ రేట్లు ఒకేసారి కుప్పకూలుతూ వస్తోన్నాయి. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ధరలు తగ్గుతుండటం కొనేవారికి ఉపశమనాన్ని కల్గిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో గోల్డ్ రేటు ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఏకంగా రూ.1.90 లక్షలకు చేరుకుంది. ఆ తర్వాత భారీగా పడిపోతూ వస్తోంది. ఈ నెలలోనే మరింతగా పడిపోతూ వస్తోంది. దీంతో ధరల్లో భారీ క్రాష్కు కారణాలేంటి అనే చర్చ బిజినెస్ వర్గాల్లో జరుగుతోంది. ఇందుకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అవేంటి అనేది చూద్దాం.
బాండ్ మార్కెట్లో మార్పులు
సాధారణంగా యుద్ద పరిస్థితుల క్రమంలో బంగారం రేట్లు పెరుగుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం రివర్స్ గేర్లో ధరలు డౌన్ అవుతున్నాయి. ఈ ఊహించని పరిణామం అందరినీ షాక్కు గురి చేస్తోంది. అయితే యుద్ద పరిస్థితులు ఉన్నా ధరలు తగ్గడం వెనుక ప్రధాన కారణం బాండ్ మార్కెట్లో వచ్చిన మార్పులుగా తెలుస్తోంది. అమెరికా 10 సంవత్సరాల కాలపరిమితి ఉన్న ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు పెంచింది. దీని వల్ల ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గు చూపారు. బంగారం కంటే ఎక్కువ ఆదాయం బాండ్ల రూపంలో వచ్చే అవకాశముంది. అంతేకాకుండా ఇది సురక్షితమైన పెట్టుబడి. దీంతో బంగారంలోని పెట్టుబడిని తీసుకుని బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ కారణంతో గోల్డ్ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయని చెబుతున్నారు.
డాలర్ బలపడటం
ఇక గత నెల నుంచి డాలర్ బలపడుతూ వస్తోంది. దీని వల్ల బంగారం ధరలు తగ్గుతూ వస్తోన్నాయి. డాలర్ సురక్షిత ఆస్తిగా మారడం వల్ల గోల్డ్ రేట్లపై ప్రభావితం చూపిస్తుంది. సాధారణంగా డాలర్ వీక్ అయినప్పుడు గోల్డ్ రేట్లు పెరుగుతాయి. బలపడినప్పుడు పసిడి ధరలు పడిపోతాయి. ఇప్పుడు డాలర్ బలపడుతుండటంతో గోల్డ్ రేట్లు కుప్పకూలుతున్నాయి. ఇక గతంలో బంగారం ధరలు పెరగడంతో చాలామంది పెట్టుబడులు పెట్టారు. అయితే ధరలు తగ్గుతున్న క్రమంలో స్టాప్ లాస్ ఆర్డర్లు పెట్టుకున్నారు. మార్జిన్ కాల్స్ కూడా రావడంతో పెట్టుబడిదారులు గోల్డ్ను విక్రయించారు. దీని వల్ల బంగారం ధరలు వేగంగా పడిపోతున్నాయి. కాగా బంగారం ధరలు ఇవాళ రూ.380 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో 24 గ్రాముల బంగారం ధర రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,31,000 వద్ద ట్రేడవుతోంది. ఇక సిల్వర్ ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది.
