
ఒకటా రెండా.. ఈ నెలలో ఏకంగా పది సినిమాలు వెండితెరపైకి వచ్చాయి. కానీ, కాసులు కురిపించే ‘క్లీన్ హిట్’ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. జనవరి నెలలో రికార్డు స్థాయి కలెక్షన్లతో ఊపు మీదున్న చిత్ర పరిశ్రమకు ఫిబ్రవరి నెల ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ప్రతి వారం కొత్త సినిమాలు క్యూ కట్టినప్పటికీ, థియేటర్ల వద్ద మాత్రం సందడి కనిపించలేదు. పేరున్న దర్శకులు, గుర్తింపు ఉన్న యువ హీరోలు బరిలోకి దిగినా, ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించడంలో విఫలమయ్యారు. ఆఖరికి వాలెంటైన్స్ వీక్లో కూడా పాత సినిమాల రీ-రిలీజ్ పైనే థియేటర్ల యజమానులు ఆధారపడాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ బాక్సాఫీస్ ఫిబ్రవరిలో ఎదుర్కొన్న ఆ పరాజయాల పరంపర మరేంటో చూద్దాం.
Funky N Couple Friendly
సేఫ్ జోన్లో సంతోష్ శోభన్..
ఈ నెలలో విడుదలైన సినిమాల్లో సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మాత్రమే కొంత ఊరటనిచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు, పెట్టిన పెట్టుబడికి తగ్గ రికవరీ సాధించి సేఫ్ జోన్లో నిలిచింది. అయితే ఇది కమర్షియల్ గా భారీ లాభాలను మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. ఇక భారీ అంచనాలతో వచ్చిన గుణశేఖర్ ‘యూఫోరియా’, విశ్వక్ సేన్ ‘ఫంకీ’ చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. కంటెంట్ లో బలం లేకపోవడం ఈ సినిమాల పతనానికి ప్రధాన కారణమైంది.
సుహాస్కు నిరాశ..
వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు సుహాస్ కు ‘హే బలవంత్’ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకు యావరేజ్ టాక్ కూడా రాకపోవడం గమనార్హం. వీటితో పాటు శివ కందుకూరి ‘నవాబ్ కేఫ్’, సాయి సింహాద్రి ‘సన్ ఆఫ్’, ‘సీతా పయనం’, ‘విత్ లవ్’, ‘శ్రీ చిదంబరం’ వంటి సినిమాలు కనీస బజ్ లేకుండా వచ్చి, అంతే సైలెంట్ గా థియేటర్ల నుండి నిష్క్రమించాయి. నెలాఖరులో ఫిబ్రవరి 27న విడుదలైన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ పైనే ఇప్పుడు అందరి ఆశలు ఉన్నాయి. దీనికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, వీకెండ్ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.
మారిన ప్రేక్షకుల పల్స్..
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని ఫిబ్రవరి ఫలితాలు రుజువు చేస్తున్నాయి. “పెద్ద సినిమా అయితేనే థియేటర్ కు వెళ్దాం, చిన్న సినిమాలను ఓటీటీలో చూసుకుందాం” అనే మైండ్సెట్ బలపడుతోంది. దీనివల్ల నైజాం, ఆంధ్రా ప్రాంతాల్లో ఎగ్జిబిటర్లు భారీ నష్టాలను చవిచూశారు. అందుకే గత్యంతరం లేక రామ్ చరణ్ ‘ఆరెంజ్’, ‘ఏమాయ చేశావే’ వంటి పాత సినిమాలను రీ-రిలీజ్ చేసి థియేటర్లను నడిపించాల్సి వచ్చింది. మొత్తానికి పది సినిమాలు వచ్చినా టాలీవుడ్ కు ఫిబ్రవరి ఒక ‘డ్రై మంత్’ గా మిగిలిపోయింది. ఇప్పుడు అందరి కళ్లు మార్చి, ఏప్రిల్ నెలల్లో రాబోయే భారీ వేసవి చిత్రాలపైనే ఉన్నాయి. మరి సమ్మర్ సీజన్ అయినా టాలీవుడ్ కు కొత్త ఊపిరి పోస్తుందో లేదో వేచి చూడాలి.
