
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు, పదవుల ప్రాధాన్యతపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ9 క్రాస్ ఫైర్లో టీడీపీ-జనసేన కూటమి లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబును విమర్శిస్తే కమ్మ సామాజికవర్గాన్ని, పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే కాపు సామాజికవర్గాన్ని దూషించినట్టు భావించడం అవివేకమని అంబటి అన్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. తనను విమర్శిస్తే కాపులను విమర్శించినట్టు కానప్పుడు.. పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే కాపులందరినీ అన్నట్టు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.
అలంకారప్రాయమైన పదవి.. అది కేవలం షేర్ కోసమే
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అనుభవిస్తున్న డిప్యూటీ సీఎం పదవికి ఎలాంటి అధికారాలు లేవని అంబటి ఎద్దేవా చేశారు. ‘‘కాపులు తమ వ్యక్తి అత్యున్నత పదవిలో ఉండాలని కోరుకోవడం సహజం. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్కు ఇచ్చింది కేవలం అలంకారప్రాయమైన పదవి మాత్రమే. ఆయన ఒక ఉత్సవ విగ్రహంలా మిగిలిపోయారు’’ అని ఆరోపించారు. చంద్రబాబు పక్కన కూర్చోబెట్టుకోవడం, హెలికాప్టర్లు పంపడం తప్ప.. ఉప ముఖ్యమంత్రిగా పవన్కు దక్కాల్సిన వాస్తవ అధికారం గానీ, గౌరవం గానీ లభించడం లేదని అభిప్రాయపడ్డారు.
