తాజావార్తలు

క్లాసికల్ భారతీయ భాషల్లో 55 సాహిత్య రచనలు విడుదల చేసిన కేంద్రం

క్లాసికల్ భారతీయ భాషల్లో 55 సాహిత్య రచనలు విడుదల చేసిన కేంద్రం


న్యూఢిల్లీ, జనవరి 6: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం (జనవరి 6) 55 సాహిత్య రచనలను విడుదల చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాస్త్రీయ భారతీయ భాషలలో విడుదల చేశారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (CIIL) ఆధ్వర్యంలోని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్లాసికల్ లాంగ్వేజెస్ సంజ్ఞా భాషలో తిరుక్కురల్ వివరణతో సహా క్లాసికల్ భారతీయ భాషలలో 55 పండిత సంపుటాలను రూపొందించింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (CICT) విడుదల చేసిన తిరుక్కురల్ సంజ్ఞా భాషా సిరీస్ కూడా ఇందులో ఉన్నాయి. తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, తమిళ భాషలలోని సాహిత్య రచనలు భాషా వారసత్వాన్ని విద్య, పరిశోధన, సాంస్కృతిక గుర్తింపు జాతీయ స్థాయిలో ఉంచడానికి చేపట్టిన అతి పెద్ద ప్రయత్నంలో ఇది ఒకటని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ వేదికగా తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం అన్ని భారతీయ భాషలను బలోపేతం చేయడానికి, ప్రోత్సహించడానికి విస్తృతంగా కృషి చేస్తుందని అన్నారు. షెడ్యూల్డ్ జాబితాలో మరిన్ని భాషలను చేర్చడం, శాస్త్రీయ గ్రంథాలను భారతీయ భాషలలోకి అనువదించడం, భారతీయ భాషలలో విద్యను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. భారతీయ భాషలను నాశనం చేయడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి కాల పరీక్షకు నిలిచాయని ఆయన అన్నారు. దేశంలోని విభిన్న జనాభాను ఏకం చేయడంలో భారతీయ భాషలు చాలా కాలంగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. భారత్‌ ప్రజాస్వామ్యానికి తల్లి అని, అపారమైన భాషా వైవిధ్యం కలిగిన దేశమని, దేశ చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య సంపదను కాపాడటం, భవిష్యత్ తరాలకు దాని గురించి అవగాహన కల్పించడం సామాజిక బాధ్యత అని ఆయన అన్నారు. తిరుక్కురల్ సారాంశాన్ని సంజ్ఞా భాషలో చేర్చడం వల్ల అందరికీ జ్ఞాన ప్రాప్తి ఉండేలా సమగ్ర భారతదేశ దార్శనికతకు బలం చేకూరుతుందని అన్నారు. ఈ 55 పండిత గ్రంథాలు భారతదేశ మేధో సాహిత్యానికి విలువైన సహకారం అందిస్తాయని అన్నారు.

ఇవి కూడా చదవండి

జాతీయ విద్యా విధానం 2020 భారతీయ భాషలలో విద్య దృక్పథాన్ని ముందుకు తీసుకువెళుతుందని, భారతదేశం వైవిధ్యంలో ఏకత్వానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలిచిందని స్పష్టం చేశారు. ఇక్కడ భాష సమాజాన్ని అనుసంధానించే మాధ్యమంగా పనిచేస్తుందని తెలిపారు. వలసవాద యుగం నాటి మెకాలే మనస్తత్వానికి భిన్నంగా, భారతీయ నాగరికత ఎల్లప్పుడూ భాషలను సంభాషణ, సాంస్కృతిక సామరస్యానికి వారధులుగా భావిస్తుందని గుర్తు చేశారు. భారతీయ భాషలపై భారతీయ భాషా సమితి, ఎక్సలెన్స్ సెంటర్లు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (CIIL) మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (CICT) లు భారతీయ భాషలను ప్రోత్సహించడానికి చేస్తున్న కృషికి ఆయన అభినందనలు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *